27, సెప్టెంబర్ 2019, శుక్రవారం

శ్మశానవాటిక (జాషువా విశ్లేషణ) . శ్రీశ్రీ తన మహప్రస్ధానము లో ఒకచోట అంటాడు కుక్కపిల్ల,సబ్బుబిళ్ల,అగ్గిపుల్ల.... కాదేది కవిత కనర్హం..."'. అంతకు కొన్ని దశాబ్దాలముందే ,అవునవును శ్మశానం కవితకు అర్హం అంటూ జాషువా ఈ ఖండకావ్యాన్ని లిఖించాడు. ఈ కావ్యంలోని పద్యాలలోని పదభావం సూటిగా పాఠకుని హ్రుదయం లోతుల్లోనికి చొచ్చుకెళ్లి,గుండె బరువెక్కుతుంది,వైరాగ్యభావం దోబుచులాడుతుంది.జీవిత చరమాంకసత్యాన్ని కళ్లెదట నిలుపుతుంది.ఈ ఖండకావ్యంలో 8 పద్యాలున్నాయి. అన్ని అణిముత్యాలాంటి పద్యాలే. దువ్వురి వారి పానశాలలో ఒకచోట కవి...అంతం లేని ఈభువనమంతయు ఒకవిశాల పాంధశాల, విశ్రాంతి గృహం,అందు ఇరుసంజెలు రంగుల వాకిలిల్.........కొంత సుఖించి పోయిరెటకో , అంటాడు. . జాషువ ఈకావ్యం మొదటీ పద్యంలో ఈవిషయాన్నే ప్రస్తావిస్తు,ఈ శ్మశానవాటికలో కొన్నివందల,వేల ఏండ్లగా నిద్రిస్తున్నవారు ఒక్కరుకూడా లేచి రాలేదు కదా అంటు ప్రారంభించాడు.ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈచలనంలేని నిద్ర అంటూ వాపోతున్నాడు. ఈ రుద్రభూమిలో తమబిడ్దలును పొగొట్తుకున్న తల్లుల రోదనలతో నిండిన కన్నిళ్ళకు వల్లకాడులోని రాళ్లు క్రాగిపోయ్యాయి అని చింతిస్తున్నాదు. కవిహృదయం చూడండి. . ఎన్నో యేండ్లు గతించిపోయినవి గానీ,యీ శ్మశానస్ధలిన్ గన్నుల్ మోడ్చిన మందభాగ్యుడొకఁడైనన్ లేచిరాఁ,డక్కటా! యెన్నాళ్ళీచలనంబులేని శయనం? బేతల్లు లల్లాడిరో! కన్నిటంబడి క్రాఁగిపోయినవి నిక్కంబిందు పాషాణముల్ . ప్రకృతిగతి తప్పి,ఆకాశంలో కారుమబ్బులు కమ్మిచిమ్మచీకటీ నిండి,దయ్యాలు,గూడ్లగూబలు చెరలాడుచు,కాకులు ముకమ్మిడిగా గోలచేసిన జనవాసం భితిల్లుతుంది.కాని ఈ శ్మశానవాటికలో భీతికి తావేలేదు.అంతా నిశ్సబ్దం....శ్మాశాన నిశ్సబ్దం..... . కవికలం ఎమంటున్నది.? ఆకాశంబున కారుమబ్బుగము లాహారించె,దయ్యాలతో ఘూకంబుల్ చెరలాడసాఁగినవి;వ్యాఘోషించె నల్దిక్కులన్ గాకోలంబులు ; గుండెఝల్లుమనుచున్నంగాని యిక్కాటియం దా కల్లాడిన జాడలే;దిచ్చట సౌఖ్యం బెంత క్రీడించునో! . ఈ రుద్రభూమికి చెడ్డవాడు,మంచివాడనే తేడాలేదు.యాజమాని,సేవకుడనే వ్యత్యాసంలేదు.హతుడు హంతకుడు యిద్దరు సమానమే ఈ నేలలో.కవి,రాజు,లేత యిల్లాలి మాంగల్యం ,చిత్రకారుడు ఎవ్వరైతేనేమి ఆయ్యుస్సు తీరాక యిక్కడ విశ్రమించవలసిన వారే!.సృష్టికి లయకారుడు శివుడు.ఆయనకిష్టమైనది తాండవం.అట్టి శివతాండవానికి అనువైనది ఈ శ్మశానవాటిక కన్నమిన్న ఏమున్నది. ఈ వాటిక శివుడు తన పిశాచఅనుచరగణంతో నాట్యమాడు రంగస్ధలమంటున్నడు కవి. అంతేకాదు ఈ రుద్రభూమి మరణదూత భూమిని పాలించు బూడితతో చేసిన సింహసనమట! ఎంతలోతు భావం కవిది. . కవిహృదయం ఏమంటుందో చూడండి. . ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము,నిప్పులలోనఁగఱగిఁపోయె ! యిచ్చోట;నే భూము లేలు రాజన్యుని యధికారముద్రిక లంతరించె! యిచ్చోట; నే లేఁత యిల్లాలి నల్లపూ సలసౌరు,గంగలోఁగలిసిపోయె! యిచ్చోట; నెట్టి పేరెన్నికం గనుఁగొన్న చిత్రలేఖకుని కుంచియ,నశించె! . ఇది పిశాచులతో నిటాలేక్షణుండు గజ్జె గదలించి యాడు రంగస్ధలంబు; ఇది మరణదూత తీక్షమౌ దృష్టు లొలయ నవనిఁ బాలించు భస్మసింహాసనంబు . రాత్రి సమయం...తిమిరం నిండిన శ్మశానం....నిశ్శభ్దం రాజ్యమేలు వేళ....ఆ మూల కొత్తసమాధి....సమాధిపై ఆముదపుదీపం, కదులుతున్న మిణుగురులా రెపరెపలాడుచూ వెలుగు చున్నది. అరే! అదేమిటి? ప్రమిదలో అముదం నిండుకున్నను ఇంకా దివ్వె వెలుగుచున్నదేమి?! ఆ సమాధిలో నిద్రిస్తున్న అభాగ్యురాలు యొక్కహృదయం కాబోలు ఆ దివ్వె వెలుగు!?....పాఠకుని గుండెను సూటిగా తాకి ఆర్ధ్రమైయ్యే భావం.ఈలాంటి భావన చెయ్యడం చేయ్యితిరిగిన కవికే సాధ్యం. . ముదురు తమస్సులో మునిఁగిపోయిన క్రొత్త సమాధిమీదఁ బై బొదలు మిణుంగురుబురువు పోలిక వెల్గుచున్నదివ్వె,ఆ ముద ముడివోయినన్ సమసిపోవుట లేదది దీప మందుమా? హృదయము సుమ్మి,నిల్పిచనియె న్గతపుత్రిక,యే యభాగ్యయో . కవితా సుధలొలికించిన కవులకలాలు, శ్రవణాందకరమైన గాయకుల కమ్మని కంఠస్వరాలు ... ఇదిగో ఈ శ్మశాన పూవాటికలో విశ్రమించాయి.పంచభౌతికమైన ఈ మేను కడకు ప్రకృతిలో కలసి పోవల్సినదే.అందులో మమైకం కావలసినదే.పుట్టుక కూడా తల్లిగర్భం నుంచే అయ్యినను,తల్లికూడా ప్రకృతి జనీతమే కదా.మట్టిలో ఖననము చెయ్యబడిన తనువు క్రమంగా కృషించి,నశించి,జీర్ణించి మట్టీలో మట్టిగా కలసిపోతుంది.మట్టిరేణువులలలో రేణువులుగా కలసిపోవును.ఔను నిక్కమే కదా!.అదిగో ఆ కుమ్మరి సారె మీదున్న మట్టిముద్దలో అల్నాటి సుకవులు కాళిదాసు,భారవుల మృతరేణువులు కలసి వున్నాయేమో కదా!. . మరి కవిమనస్సు ఏమంటున్నది. . కవుల కలాలు,గాయకుల కమ్మని కంఠము లీ సశ్మశానపుం గవనులఁ ద్రొక్కి చూచెడి;నొకానొకనాఁడల కాళిదాస భా రవుల శరీరముల్ ప్రకృతిరంగమునం దిపు డెంత లేసి రే ణువు లయి మృత్తికం కలిసెనో కద! కుమ్మరి వాని సారె పై. . శ్మశానవాటిక వాకిటనుంచొని ఒకపర్యాయం పరికించి చూచిన మనగుండెలు తర్కుపోతాయి.మన మనస్సు కరిగినీరై పోతుంది ఆమూలనున్న అన్నెం పున్నెం ఎరుగని వయస్సులోనే మృత్యువు గర్భంలో చేరిన చిన్నారుల గోరిలను చూస్తే.ఆ పిల్లల సమాధులలో ఏచిన్నారి పొన్నారిరూపసి తనువు చాలించిందో? ఏ ముద్దులు మూటలుకట్టు రూపసి అలసిసొలసి నిద్రిస్తున్నదో.ఏ తల్లి లీలావతి కడుపుతీపి దాగున్నదో? . ఆలోకించిన గుండిల్గరగు; నాయా పిల్ల గోరీలలో నే లేబుగ్గల సౌరు రూపరియెనో!యేముద్దు నిద్రించెనో! యే లీలావతి గర్భగోళమున వహ్నిజ్వాల జీవించునో? యీలోకంబున వృద్ధిగాదగిన యేయే విద్య లల్లాడునో? . వల్లకాడులో అస్పృశ్యతకు తావు లేదు.ఏ మతమైన,ఏ కులమైన,ఏ వర్ణమైన ఇక్కడ ఒక్కటే. అందరిని స్వీకరించడంలో సమతా భావం.పులిపక్కన సాధుజంతువు మేకను జేర్చి బుజ్జగించి ,వూరడించు అభేదభావనావని ఈ శ్మశానభూమి. ఇట నస్పృశ్యత సంచరించుటకు దావేలేదు;విశ్వంభరా నటనంబున్ గబలించి గర్భమున విన్యస్తంబు గావించి, య త్కటంపు బెబ్బులితోడ మేకఁ నొక్క పక్కజేర్చి జోకొట్టి యూ ఱట గల్పించు నభేదభావమును, ధర్మం బిందుఁ గారాడెడిన్ . మారుతున్న ,పరిగెడుతున్న కలికాలంలో ఆర్ధికఅవసరాలు,ధనవ్యామోహం-రక్తబంధాలను,పాశాలను త్రెంచుతున్నాయి.తమను కని,అల్లారు ముద్దుగా పెంచి,పోషించిన తల్లిదండ్రులను వృధ్యాపంలో,బ్రతికి వుండగానే వల్లకాటిలో అర్ధరాత్రి వదలివెళ్ళూచున్న రోజులివి.ఆలాంటప్పుడు అనాధ పేదవాని మృతశరీరాన్ని పట్టించుకొని,ఖననముచెయ్యు దాతలెందరు?.అన్నింటికన్న దారుణమైనది,భయంకరమైనది దరిద్రం/పేదరికం. శ్మశానంలో ఖననానికి నోచుకోని ఒక అనాధపీనుగను గూర్చి కవి ఎంత హృదయఆర్తితో వర్ణించాడో.అది కవి వేదనకాదు...పాఠకుని హృదయ ఘోష...కాదందురా? . వాకొనరాని గొప్ప ధనవంతుని నిద్దపుఁ బాలరాతి గో రీకడఁ బారవేయబడి ప్రేలికలం బొరలాడు ప్రేత మే యాకటి చిచ్చునన్ గుమిలి,యార్చి,గతించిన పేదవాని దౌ నో కద! వానికై వగవఁ డొక్కదండు; దాఁచదు కాటినేలయున్

24, సెప్టెంబర్ 2019, మంగళవారం

*చెల్లియొ చెల్లకో తమకు జేసినయెగ్గులు సైచిరందరున్ తొల్లి గతించె, నేడు నను దూతగ బంపిరి సంధి సేయ, నీ పిల్లలు పాపలుం ప్రజలు పెంపు వహింపగ బొందు సేసెదో యెల్లి రణంబు గూర్చెదవో? యేర్పడ జెప్పుము కౌరవేశ్వరా! *జెండాపై కపిరాజు, ముందు సితవాజి శ్రేణియుం గూర్చి నే దండంబుంగొని తోలు స్యందనముమీద న్నారి సారించుచుం గాండీవమ్ము ధరించి ఫల్గుణుడు మూకం జెండుచున్నప్పు డొ క్కండున్ నీమొఱ నాలకింపడు కురుక్ష్మానాథ సంధింపగన్ !!

*చెల్లియొ చెల్లకో తమకు జేసినయెగ్గులు సైచిరందరున్ తొల్లి గతించె, నేడు నను దూతగ బంపిరి సంధి సేయ, నీ పిల్లలు పాపలుం ప్రజలు పెంపు వహింపగ బొందు సేసెదో యెల్లి రణంబు గూర్చెదవో? యేర్పడ జెప్పుము కౌరవేశ్వరా! *జెండాపై కపిరాజు, ముందు సితవాజి శ్రేణియుం గూర్చి నే దండంబుంగొని తోలు స్యందనముమీద న్నారి సారించుచుం గాండీవమ్ము ధరించి ఫల్గుణుడు మూకం జెండుచున్నప్పు డొ క్కండున్ నీమొఱ నాలకింపడు కురుక్ష్మానాథ సంధింపగన్ !!

22, సెప్టెంబర్ 2019, ఆదివారం

చెప్పండి చూద్దాం... క్షమ గలిగిన సిరి గలుగును క్షమ గలిగిన వాణి గలుగు సౌఖ్యము లెల్లన్ క్షమ గలుగఁ దోన కలుగును క్షమ గలిగిన మెచ్చు శౌరి సదయుఁడు దండ్రీ! పోతన భాగవతం నవమ స్కందం 463 వ పద్యమిది. పరశురాముని చరిత్రం లోని పద్యం. పరశురాముడు కార్తవీర్యార్జునుడిని సంహరించి కామ ధేనువును ఆశ్రమానికి తీసుకు వచ్చి తన పరాక్రమాన్ని తండ్రికి చెపుతాడు. అపుడు పరశురాముడి తండ్రి జమదగ్ని , కుమారుడితో అన్న మాటలీ కంద పద్యం. క్షమ కలిగి ఉంటే సంపద కలుగుతుంది. క్షమ ఉంటే విద్య అబ్బుతుంది. క్షమ ఉంటే సుఖములన్నీ కలుగుతాయి. మూడవ పాదంలో దోన అంటే ఏమిటో ఒక పట్టాన అర్ధం కాదు. ఆఖరి పాదం - క్షమ కలిగి ఉంటే దయామయుడైన శ్రీ హరి సంతోషిస్తాడు. ఇప్పుడు చెప్పండి క్షమ కలుగ దోన కలుగును అన్న వాక్యంలో దోన కు అర్థం ఏమిటి?

16, సెప్టెంబర్ 2019, సోమవారం

ఏతమేసి తోడినా ఏరు ఎండదు  పొగిలిపొగిలి ఏడ్చినా పొంత నిండదు  దేవుడి గుడిలోదైనా పూరిగుడిసెలోదైనా గాలి యిసిరి కొడితే..  ఆ దీపముండదు.. ఆ దీపముండదు..!!ఏతమేసి!! పలుపుతాడు మెడకేస్తే పాడి ఆవురా  పసుపుతాడు ముడులేస్తే ఆడదాయిరా కుడితి నీళ్ళు పోసినా అది పాలు కుడుపుతాదీ కడుపు కోత కోసినా అది మనిషికే జన్మ ఇత్తాదీ బొడ్డు పేగు తెగిపడ్డ రోజు తలుచుకో గొడ్డు కాదు ఆడదనే గుణం తెలుసుకో..!!ఏతమేసి!! అందరూ నడిసొచ్చిన తోవ ఒక్కటే సీము నెత్తురులు పారే తూము ఒక్కటే మేడ మిద్దెలో ఉన్నా చెట్టు నీడ తొంగున్నా నిదర ముదరపడినాక పాడె ఒక్కటే ఒల్లకాడు ఒక్కటే కూత నేర్చినోళ్ళ కులం కోకిలంటరా ఆకలేసి అరిసినోళ్ళు కాకులంటరా..!!ఏతమేసి!! జాలాది గారి

       కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే?              వారేరీ సిరిమూటఁగట్టుకొని పోవంజాలిరే? భూమిపైఁ               బేరైనం గలదే? శిబిప్రముఖులుంబ్రీతిన్ యశః కాములై               యీరే కోర్కులు? వారలన్ మఱచిరేయి క్కాలమున్? భార్గవా!         భర్గుని కమారుడైన శుక్రాచార్యా! పూర్వం కూడ ఎందరో రాజులు ఉన్నారు కదా. వారికి రాజ్యాలు ఉన్నాయి కదా. వాళ్ళు ఎంతో అహంకారంతో ఎంతో విర్రవీగినవారే కదా. కాని వా రెవరు సంపదలు మూటగట్టుకొని పోలేదు కదా. కనీసం ప్రపంచంలో వారి పేరైనా మిగిలి లేదు కదా. శిబి చక్రవర్తివంటి వారు కీర్తికోసం సంతోషంగా అడిగినవారి కోరికలు తీర్చారు కదా. వారిని ఈ నాటికీ లోకం మరువలేదు కదా.          వామనునికి దానం ఇవ్వద్దు అన్న శుక్రాచార్యులకు సమాధానం చెప్పే సందర్భంలో బలి చక్రవర్తిచే పోతన పలికించిన జగత్రసిద్ధ మైన పద్య మిది.          కారే = కలుగరా; రాజులు = రాజులు;రాజ్యముల్ = రాజ్యములు; గలుగవే -కలుగవే = పొందలేదా ఏమి;గర్వోన్నతింబొందరే - గర్వ = అహంకారముతో; ఉన్నతిన్ = విర్రవీగుటను;పొందరే = చెందలేదా ఏమి; వారేరీ - వారు = వాళ్ళందరు; ఏరి = ఎక్కడ ఉన్నారు; సిరి -సిరిని = సంపదలను; మూటఁగట్టుకొని -మూటగట్టుకొని = కూడగొట్టుకొని;పోవంజాలిరే = తీసుకెళ్ళగలిగిరా, లేదు;భూమిపైఁబేరైనంగలదే - భూమి = నేలపైన;పేరైనన్ = కనీసము పేరైన; కలదే = ఉన్నదా, లేదు; శిబిప్రముఖులుంబ్రీతిన్ - శిబి = శిబిచక్రవర్తి; ప్రముఖులున్ = మొదలగువారు;ప్రీతిన్ = కోరి; యశఃకాములై - యశః = కీర్తి;కాములు = కోరువారు; ఐ = అయ్యి; యీరే -ఈరే = ఇవ్వలేదా; కోర్కులు = దానములను;వారలన్ = వారిని; మఱచిరే = మరచిపోయారా, లేదు; యిక్కాలమున్ - ఈ= ఇప్పటి; కాలమున్ = కాలమునందును;

15, సెప్టెంబర్ 2019, ఆదివారం

నేనొక విశ్వప్రేమికురాలను ఈ విశ్వమంతా నేను వ్యాపించాను నేనొక నదీ ప్రేమికురాలను అన్ని నదుల్లోను నేను ప్రవహిస్తాను నేనొక అరణ్య ప్రేమికురాలను ప్రతి చెట్టు మీద పుప్పొడిలా రాలుతుంటాను నేనొక సముద్ర ప్రేమికురాలను ప్రతి కెరటం మీద నాట్యం చేస్తుంటాను నేనొక పున్నమి ప్రేమికురాలను వెన్నెల జలతారుల్లో ఊయలూగుతుంటాను నేనొక నలుపు రంగు ప్రేమికురాలను అమావాశ్య రోజు ఆకాశం లో కలిసిపోతాను నేనొక మనిషి ప్రేమికురాలను ఆడా మగా హద్దులను కూలగొడుతుంటాను నాకు కులం, మతం,ప్రాంతం ఏమి లేవు నాది విశ్వ ప్రేమ,ప్రకృతి ప్రేమ... మనిషి మీద అనంతమైన ప్రేమ నాకు.

11, సెప్టెంబర్ 2019, బుధవారం

పాఠము మఱియు అర్థముసవరించు ౧. జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే గలేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాం డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకారచండతాండవంతనోతునశ్శివశ్శివమ్ - అరణ్యమును పోలు జటాజూటము నుంచి స్రవించు గంగానదీ ప్రవాహముచేత శుద్ధి చెందినా కంఠసీమను మాలవలె అలంకరించిన సర్పము కలిగినవాడు, తన డమరుకము నుండి డమ డమ శబ్దములు వెల్వడిరాగా ఆనంద తాండవమొనర్చుచున్నవాడు అయిన పరమశివుడుమనకు సమస్త శుభములను కలిగించుగాక ౨. జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ విలోలవీచివల్లరీ విరాజమానమూర్ధనీ ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టపావకే కిశోరచంద్రశేఖరేరతి:ప్రతిక్షణంమమ - (అట్టి ఆనందతాండవము చేయుచున్న పరమశివుడు) జటాజూటము నందు సురనదీ ప్రవాహమును కలిగినవాడు, ఆ ప్రవాహము పైకి ఎగబ్రాకుతున్న తీగలవంటి కురులు కలిగిన శిరోభాగము కలిగినవాడు, జ్వాలలతో వెలుగొందు అగ్నిని తన ఫాలప్రదేశమునందున్నవాడు, బాలచంద్రప్రభతో శోభిల్లునట్టివాడు అయిన పరమశివుని యందు నా మనస్సు ప్రతిక్షణమూ రమించుచున్నది. ౩. ధరాధరేంద్రనందినీ విలాసబంధుబంధుర స్పురద్ధిగంతసంతతి ప్రమోదమానమానసే కృపాకటాక్షధోరణీ నిరుద్ధదుర్ధరాపది క్వచిద్దిగంబరే మనోవినోదమేతు వస్తునీ - (అట్టి ఆనందతాండవము చేయుచున్న పరమశివుడు) విలాసమైన పర్వతరాజపుత్రిక కు మగడు, ఎవని మనస్సు దిగంతములలోని సమస్త జనుల ఉనికితో నిండియున్నదో, ఎవని కృపాకటాక్షవీక్షణములు సోకితే సమస్త ఆపదలూ నశించునో, అట్టి దిక్కులే అంబరములుగా ఉన్నవానిపైన నా మనస్సు రంజించుచున్నది. ౪. జటాభుజంగపింగళ స్ఫురత్ఫణామణిప్రభా కదంబకుంకుమద్రవప్రలిప్తదిగ్వధూముఖే మదాంధసింధురస్ఫుర త్వగుర్తరీయమేదురే మనో వినోదమద్భుతంభిభర్తుభూతభర్తరి - (అట్టి ఆనందతాండవము చేయుచున్న పరమశివుడు) జటాజూటమును అలంకరించిన పచ్చని సర్పముయొక్క ఫణి మణికాంతులతో విరాజిల్లుచూ, దిక్కులను కదంబకుంకుమ కాంతులతో నింపుచుండగా, పైని గజచర్మముతో చేయబడిన ఉత్తరీయము ఎగసి మదపుటేనుగును పోలగా సమస్త భూతపతిగా శోభించుచున్న వాడు నా మనస్సును ఆనందముతో నింపుగాత ౫. సహస్రలోచనప్రభుత్యశేషలేఖశేఖర ప్రసూనధూళిధోరణీవిధూసరాంఘ్రిపీఠభూః భుజంగరాజమాలయానిబద్ధజాటజూటకః శ్రియైచిరాయ జాయతాం చకోరబంధుశేఖరః - అశేషమైన ఇంద్రాది దేవతలయొక్క పంక్తి మొక్కుటచే ప్రభవించిన ధూళిచేత కప్పబడిన పాదపీఠముకలిగి, వాసుకి అనెడు సర్పరాజముచేత బంధింపబడిన జటాజూటము కలిగి, చకోట పక్షులకు ప్రియుడైన చంద్రుని శిఖయందు ధరించినవాడు మాకు శ్రియములనొసగుగాక. ౬. లలాటచత్వరజ్వలద్ధనంజయస్ఫులింగభా నిపీతపంచసాయకంనమన్నిలింపనాయకమ్ సుధామయూఖలేఖాయావిరాజమానశేఖరమ్ మహాకపాలిసంపదేశిరోజటాలమస్తునః - హోమాగ్నివలె ప్రజ్వరిల్లుచున్న లలాటాగ్ని కలిగి, ఆ అగ్నిలో పంచబాణుడైన మన్మథుని ధగ్ధము చేసినవాడు, లోకనాయకుడు, అమృతకిరణముల పంక్తిచేత విరాజిల్లుచున్న శిఖకలిగినవాడు మహాకపాలమును ధరించువాడు అయిన పరమేశ్వరునికి మ్రొక్కి మేము ఆయన శిఖలోని సంపదలకు ప్రాప్తులు కాగలము. ౭. కరాళ ఫాలపట్టికా ధగద్ధగద్ధగజ్జ్వల ద్ధనంజయాహుతీకృతప్రచండపంచసాయకే ధరాధరేంద్రనందినీకుచాగ్రచిత్రపత్రక ప్రకల్పనైకశిల్పినీ త్రిలోచనే రతిర్మమ - భీకరమైన ఫాలప్రదేశమున ధగద్ధగాయమాన జ్వాలలతో వెలుగొందు అగ్నిచేత మన్మథుని దాహించినవాడు, పార్వతీదేవియొక్క కుచములపైని చిత్రములు రచించువాడు (ఆమె యందు అనురక్తి కలవాడు), మాహాశిల్పి (లోకసృష్టియందు) అయిన త్రిలోచనునియందు నా మనస్సున్నది. ౮. నవీనమేఘమండలీ నిరుద్ధధుర్ధరస్ఫురత్ కుహూనిశీధినీతమః ప్రబంధబద్ధకంధరః నిలింపనిర్ఝరీ ధరస్తనోతు కృత్తిసింధురః కళానిధాన బంధురః శ్రియం జగద్ధురంధరః - క్రొత్త మేఘముల సమూహము వంటిది, దురాపదలను నిర్మూలింపదగినదయి స్ఫురించునది, కుహూరాత్రియందు చీకటి మాదిరి భాసించు నల్లని కంఠము కలిగినవాడు, గంగానదిని ధరించువాడు, గజచర్మాంబరధారీ, చంద్రకళాధరుడు, జగత్కళ్యాణకర్త మాకు శ్రియములు చేకూర్చుగాక ౯.ప్రపుల్లనీలపంకజ ప్రపంచకాలిమప్రభా వలంబికంఠకందలీ రుచిప్రబద్ధకంధరమ్ స్మరచ్ఛిధం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదమ్ గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే - వికసించిన నీలసరోజ సమూహమువలె నల్లని ప్రభ తోచు కంఠసీమను అవలంబించినడి అను భ్రాంతి కలిగించువిధముగా సర్పాలన్కృత కంఠముచేత భాసిల్లువాడు, మన్మథారి, త్రిపురారి, భావారి, మఖారి, గజారి, అంధకారి, యమారి అగువానిని భజించెదను. ౧౦. అఖర్వసర్వమంగళా కళాకదంబమంజరీ రసప్రవాహమాధురీవిజృంభణామధువ్రతమ్ స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకమ్ గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే - సమస్త మంగళములనూ పొడిగించువాడు, కదిమిపూల తేనెయందు అనురక్తి కలిగినవాడు, మన్మథారి, త్రిపురారి, భావారి, మఖారి, గజారి, అంధకారి, యమారి అగువానిని భజించెదను. ౧౧. జయత్వదభ్రవిభ్రమభ్రమద్భుజంగమశ్వస ద్వినిర్గమత్క్రమస్ఫురత్కరాళఫాలహవ్యవాట్ ధిమిద్ధిమిద్ధిమిద్ధ్వనన్మృదంగతుంగమంగళ ధ్వనిక్రమప్రవర్తితప్రచండతాండవశ్శివః - భుజంగోచ్చ్వాసనిశ్వ్వాసలు ఆకాశముచేయు జయజయధ్వానములు కాగా, బయటికి వెల్వడు ఫాలప్రదేశ విస్ఫులింగములు క్రమముగా చేకూర, ధిమిధిమి నాదములతో ఢమరుకము ఉచ్చమంగళరీతి మ్రోగగా వాటికి అనుగుణముగా ప్రచండతాండవము చేయు పరమశివుని ... ౧౨. దృషద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తికస్రజో ర్గరిష్ఠరత్నలోష్టయోః సహృద్విపక్షపక్షయో తృణారవిందచక్షుషో ప్రజామహీమహేంద్రయో సమప్రవృత్తికః కదా సదాశివం భజామ్యహమ్ - చూడగా, విచిత్రములైన లోకరీతులు - భుజంగహారము కానీ, ముత్యపుసరము కానీ, అమూల్యరత్నము కానీ, లేక మట్టి గానీ, తనవాడు కానీ లేక పెరవాడు కానీ, గడ్డివంటి కనులుండనీ, లేక అరవిందలోచనుడు కానీ, సామాన్యుడు కానీ మహారాజు కానీ, నేను సమముగా తలచి ఎప్పుడు మహేశ్వరున్ని సేవించగలను. ౧౩. కదానిలింపనిర్ఝరీ నికుంజకోటరేవసన్ విముక్తదుర్మతిస్సదాశిరస్థమంజలింవహన్ విలోలలోలలోచనో లలామఫాలలగ్నకః శివేతిమంత్రముచ్ఛరన్ కదా సుఖీ భవామ్యహమ్ - ఎప్పుడు నేను సురనదీతీరమున గల సుందరవనములయందు వసించి దుర్మతిని వీడి, సదా శిరస్సుపైన అంజలి చేర్చి, వికలమైన చూపు లేక, ఫాలలలామునియందు మనస్సు చేర్చి, "శివ" అను మంత్రము జపించుచూ సుఖించెదను?

***బట్టతలపై పద్యము.*** తలనూనె రాసెడు తగులాటముండదు- క్షౌరశాలకు వెళ్ళు కర్మ లేదు పేలు కొంపలు గట్టు పెనుబాధ తప్పును- చుండ్రు బాధలు తప్పి సుఖము గల్గు పెళ్ళాము కోపాన పెనుగులాడెడు వేళ- జుట్టింత దొరకదు పట్టుకొనగ అద్దంబు దువ్వెన లవసరమే లేదు- పర వనితలు వెంటబడుట కల్ల తేటగీతి. కడకు కుంకుడు, శీకాయ ఖర్చు మిగులు తలకు స్నానంబు చేయుట సులభమౌను ఇన్ని గణనీయ లాభంబు లెంచి చూడ బట్టతల గల్గు వాడె పో భాగ్యశాలి.

10, సెప్టెంబర్ 2019, మంగళవారం

వాట్సాప్ మెసేజ్ ల పై పేరడీ పాట: _*పల్లవి:*_ నేను పుట్టాను, లేండ్ లైన్ వచ్చిందీ ... ... ... నేను ఏడ్చాను, సెల్ ఫోన్ వచ్చిందీ ... ... ... నేను నవ్వాను, స్మార్ట్ ఫోన్ వచ్చింది. నాకింకా లోకంతో పని ఏముంది. డోన్ట్ టాక్. ॥నేను పుట్టాను ... ... ... ॥ _*1వ. చరణం:*_ మనిషిని మనిషిని కలిపేటందుకు లేండ్ లైన్ వచ్చిందీ ... ఎవరికి దొరకక తిరిగేటందుకె సెల్ ఫోన్ వచ్చిందీ ... ఒంటరి తుంటరి బ్రతుకు కోసమై స్మార్ట్ ఫోన్ పుట్టిందీ ... అందరి బుర్రలు నమలడానికే వాట్సాప్ వెలిసింది. డోన్ట్ టాక్. ॥నేను పుట్టాను ... ... ... ॥ _*2వ చరణం:*_ లేండ్ లైన్ మ్రోగితే, అందరి గుండెలు ఆనందించాయీ ... సెల్ ఫోన్ మ్రోగితే, అందరి మనసులు చిరాకు పడ్డాయీ ... స్మార్ట్ ఫోన్ తో, అందరి బ్రతుకులు చతికిల బడ్డాయీ ... తెల్లవారినా అవి, కొంచెం కూడా బాగవ కున్నాయి. డోన్ట్ టాక్. ॥ నేను పుట్టాను ... ... ... ॥ _*3వ చరణం:*_ వాట్సాపులో వసతులతోటీ, షరతులు వున్నాయీ ... హద్దు మీరితే అంతు తెలియనీ, శిక్షలు పడతాయీ ... స్మార్ట్ ఫోనులో భాషల కుండే, సొగసులు తగ్గాయీ ... ఎమోజీ(emoji) లతో, ఎవరికి తెలియని భాషలు పుట్టాయి. డోన్ట్ టాక్. ॥ నేను పుట్టాను ... ... ... ॥ _*4వ చరణం:*_ మనుషుల మనసులు, కలిపేటందుకె ఫోనులు వున్నాయీ ... ఏ ఫోనైనా, మంచిగ వాడే మార్గాలున్నాయీ ... మంచిగ వాడని, ఫోనుల కెపుడూ వైరస్ లొస్తాయీ ... వాట్సాపులో, పెట్టేటందుకె నీతులు వున్నాయి. డోన్ట్ టాక్. ॥ నేను పుట్టాను ... ... ... ॥ _*5వ చరణం (ఆఖరి చరణం):*_ గంటలు రోజులు స్మార్ట్ ఫోనులో, వాగుతు గడిపేసెయ్ ... ఫోన్లో వున్న బేటరి తీసి, బయటకు పారేసెయ్ ... వైఫై సిగ్నల్ ఆపేసెయ్ ... సిమ్ము కార్డును విసిరేసెయ్ ... డ్రైవ్ ద డేటాకార్డ్ ఔట్ ... ... ... హహ్హహ్హహ్హహ్హ !!! ॥నేను పుట్టాను ... ... ... ॥ _*ప్రేమ్ నగర్*_ సినిమా లోని _*ఘంటసాల మాస్టారు*_ పాడిన _*నేను పుట్టాను ... ... ... *_ పాటకు

8, సెప్టెంబర్ 2019, ఆదివారం

కరచాలనాలు వద్దు...నమస్కారాలే ముద్దు -------------------------------------------- తలలోని పోలుసులై జిలపెట్టు చుండ్రును.. గోరార హాయిగా గోకు చేయి కళ్ళలో పుసులను వేళ్ళతో తొలగించి ...వాల్చూపు సొగసు కాపాడు చేయి జలుబుతో నాసిక జలపాత మవువేళ.. ,చీమిడి బర్రు బర్రునా చీదు చేయి ముక్కులో కొలువైన పోక్కుల్ని నేర్పుగా... కెలికి కెలికి వెలికి వలుచు చేయి చేవిలోతు లోతుల్లో చేరినా గులిమిని.... .....చిటికినవేలితో చెణకు చేయి గజ్జలసందులో ఘనమైన మట్టిని.......... నలుగుపెట్టినట్టు నలుపుచేయి కురుపులు ,గాయాల,దురదల్నికడతేర్చ.. బర బరా బర మని బరకు చేయి మలమూత్రముల కంపు చెలరేగిపోకుండ... చెంబుడు నీళ్ళతో కడుగు చేయి అట్టి ఆ చేయి మర్యాద యుట్టిపడగ ...నిన్ను తాకంగా ఇటువచ్చుచున్నదోయి ఎవరిచేతులో ఏముందో ఎవరికెరుక ......కోటి రోగాల పుట్ట ఈ చేయి గనక చాలు చాలింక.. కరచాలనాలు చాలు ........దండమేట్టినవాడేరా..ధన్యజీవి ..!!

6, సెప్టెంబర్ 2019, శుక్రవారం

కిన్నేరమ్మసొగసులు...కూనలమ్మ కులుకులు...ఎంకి తీయని కలలు...మనతెలుగు పలుకులు....:కి : నన్నయ తిక్కన కవుల పదభందాలూ...సాహితీ ప్రియులకూ సుమగంధాలూ...:న: శ్రీనాధుని సీసం ...పోతన మకరందం...సరసహృదయవర్యులకూ నవరస నైవేద్యం....:కి: కృష్ణరాయ ఫ్రౌడత్వం...పెద్దన నవసీసం....తెలుగు భాషకంతటికీ దేదీప్య మణిమకుటం.. నాయకరాజుల చరితం.. చేమకూరిప్రతి పద్యం..తెలుగు వెలుగు జిలుగులకు కనకాభిషేకం....:కి; కవివరేన్యులందరికీ కవితారస చందనం..వాగ్గేయకారులకూ పదేపదే వందనం ... నవ్యకవులు.భవ్యకవులు.. అందుకోండి స్వాగతం!!...తెలుగుజాతికంతటికీ ఈ గీతం అంకితం..!!..: కి;